Hyderabad: 'హాస్టల్ కి వెళ్లి చదువుకోవడం ఇష్టం లేదు నాన్నా'... లేఖ రాసి వెళ్లిపోయిన హైదరాబాద్ యువతి!

  • ఉన్నత చదువులు చదివించాలని భావించిన తండ్రి
  • తనకు ఇష్టం లేని పని చేస్తున్నారని ఆరోపించిన కుమార్తె
  • ఇల్లొదిలి వెళ్లడంతో మిస్సింగ్ కేసు నమోదు

తండ్రి కోరుకున్నట్టుగా హాస్టల్ కు వెళ్లి చదువుకోవడం ఇష్టంలేని ఓ కూతురు ఇల్లొదిలి వెళ్లిపోయిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, పద్మాలయ అంబేద్కర్ నగర్ లో నివసించే అప్పారావు, అపోలో ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుండగా, ఆయన కుమార్తె దీపిక (20) ఇంటర్ పూర్తి చేసింది. ఆమెను ఉన్నత చదువులు చదివించాలన్న ఆశయంతో ఉన్న అప్పారావు, డిగ్రీ కోసం గురుకులంలో చేర్చాలని భావించి ఫీజు కట్టాడు.

బుధవారం నాడు ఆమెను హాస్టల్ లో దింపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ లేఖ రాసిపెట్టిన దీపిక, ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తనకు హాస్టల్ కు వెళ్లడం ఇష్టం లేదని, తాను అనుకున్నది వేరు, నాన్న చేస్తున్నది వేరని, తనకు నచ్చింది చేయనివ్వడం లేదని వాపోయింది. బలవంతంగా హాస్టల్ కు వెళ్లి చదువుకోలేనని చెప్పింది. తనను అనుమానిస్తున్నారని, ఫ్రీడమ్ ఇవ్వడం లేదని, ఎక్కడికీ పంపించడం లేదని, ఇదంతా తనకు కష్టంగా ఉందని లేఖలో తెలిపింది. అప్పారావు ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

More Telugu News