New Delhi: క్షీణించిన ఆప్ మంత్రి ఆరోగ్యం... బలవంతంగా ఆసుపత్రికి తరలింపు!

  • వారం రోజులుగా కొనసాగుతున్న కేజ్రీవాల్ దీక్ష
  • ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా
  • గత రాత్రి సత్యేంద్ర జైన్ ను ఆసుపత్రికి తరలించిన అధికారులు

గడచిన ఏడు రోజులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అపాయింట్ మెంట్ కోరుతూ, ఆయన కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ తో కలసి దీక్ష చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించడంతో, ఆయన్ను బలవంతంగా లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, రాత్రికి కీటోన్ స్థాయి గణనీయంగా పడిపోయిందని, తలనొప్పితో పాటు ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నామని డాక్టర్ జేఎస్ పాసీ వెల్లడించారు.

అంతకుముందు సత్యేంద్ర జైన్ ఓ ట్వీట్ పెడుతూ, తాము ఢిల్లీ వాసుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్, మరో ఇద్దరు మంత్రుల దీక్ష కొనసాగుతోంది. కార్డియాలజిస్ట్, డయాబెటాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ లు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని డాక్టర్ పాసీ తెలిపారు. ఆసుపత్రికి తరలించిన తరువాత జైన్ కోలుకుంటున్నారని కేజ్రీవాల్ ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

More Telugu News