Pramod muthalik: గౌరీ లంకేశ్‌ ఓ కుక్క.. ఆమె చనిపోతే మోదీ సమాధానం చెప్పాలా?: శ్రీరామ్ సేన చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ హయాంలోనూ హత్యలు జరిగాయిగా?
  • అప్పుడెవరూ మాట్లాడలేదు
  • ఇప్పుడో కుక్క చనిపోతే మాత్రం రాద్ధాంతం

కర్ణాటకలో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంకేశ్ హత్య కేసులో ప్రధాని మౌనం వీడాలంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన ఆయన.. ‘‘కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి మోదీ ఎందుకు స్పందించాలి?’’ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు హత్యలు జరిగాయన్నారు. అప్పుడెవరూ కాంగ్రెస్‌ను తప్పుబట్టలేదని, కానీ కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఆయన ఆ మాట అనగానే కార్యకర్తలు కొందరు జై శ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినదించారు.

ప్రమోద్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. కర్ణాటకలో జరిగే ప్రతీ హత్యకు ప్రధాని సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే అలా అన్నాను తప్పతే, లంకేశ్‌ను నేరుగా కుక్క అని ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు.  మరోవైపు, లంకేశ్‌ను హత్య చేసిన నిందితుడు పరశురామ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు, శ్రీరామ్ సేనతో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

More Telugu News