Ambati Rayudu: యోయో టెస్ట్‌లో రాయుడు ఫెయిల్.. జట్టు నుంచి ఔట్!

  • రాయుడు స్థానంలో రైనాకు చోటు
  • వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు
  • ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ చూపిన రాయుడు

ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టు నుంచి అంబటి రాయుడును పక్కనపెట్టారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఈ నెల 15న నిర్వహించిన యోయో టెస్టులో రాయుడు విఫలమైనట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. రాయుడు స్థానాన్ని స్టార్ ఆటగాడు సురేశ్ రైనాతో భర్తీ చేయనున్నట్టు తెలిపింది. జూలై 3 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

అంబటి రాయుడు చివరిసారిగా జూన్ 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఆడాడు. తాజాగా ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టులో రాయుడుకు చోటు కల్పించారు. అయితే యోయో పరీక్షలో విఫలం కావడంతో పక్కనపెట్టారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రాయుడు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుత ప్రతిభ కనబరిచాడు. జట్టు ట్రోఫీని గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడికి భారత జట్టులో చోటు కల్పించారు.

భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్.

More Telugu News