Andhra Pradesh: కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన లారీ.. ఏడుగురు దుర్మరణం

  • మామిడికాయల లోడుతో తమిళనాడు వెళ్తున్న లారీ
  • అర్ధరాత్రి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలోకి..
  • ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ సరిహద్దులో పెను విషాదం చోటుచేసుకుంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అర్ధరాత్రి అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దర్మరణం పాలవగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాయనూరు నుంచి తమిళనాడులోని వానియంబాడికి మామిడికాయల లోడుతో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో లారీలో 30 మంది ఉన్నారు.

ఘాట్ రోడ్డు కావడంతో పెద్దవంక వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రాణాలు కోల్పోయిన ఏడుగురిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులను తమిళనాడుకు చెందిన కూలీలుగా గుర్తించారు. అర్ధరాత్రి, దానికి తోడు అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. క్షతగాత్రులను వానియంబాడి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో నలుగురిని వేలూరుకు తరలించారు.
 
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాద వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

More Telugu News