Vijayawada: ఏపీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో క్షురకుల నిరసన... ఆగిన తలనీలాల మొక్కులు!

  • విజయవాడ, శ్రీశైలం, అరసవెల్లిలో నిరసనలు
  • వేతనాలు పెంచాలని క్షురకుల డిమాండ్
  • మొక్కులు తీరేదెలాగంటూ భక్తుల ఆందోళన

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవాలయాల్లో క్షురకులు నిరసనలకు దిగారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, అరసవల్లి సూర్యనారాయణస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాచలం అప్పన్న తదితర దేవాలయాల్లో భక్తులకు తలనీలాలు తీయకుండా క్షురకులు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో తమ మొక్కులు ఎలా తీరాలంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆలయాల్లోని కేశఖండన శాలల ముందు బైఠాయించిన క్షురకులు తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ, ధర్నా నిర్వహిస్తున్నారు.

కాగా, రెండువారాల క్రితం దుర్గగుడి క్షురకునిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య చెయ్యి చేసుకున్న ఘటన కలకలం రేపగా, ఆయనపై చర్యలు తీసుకోలేదని క్షురకులు ఆరోపిస్తూ ఈ ఉదయం ధర్నాకు దిగారు. తమకు పాలకమండలి చైర్మన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు. స్థిర వేతనాలు తమకు లేవని, తలనీలాలు తీసిన అనంతరం భక్తులు సంతృప్తితో ఇచ్చే చిల్లరను కూడా తీసుకోనివ్వడం లేదని వారు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఇదే సమయంలో మిగతా దేవాలయాల క్షురకులు మూకుమ్మడిగా వారికి సంఘీభావం తెలిపి తమ డిమాండ్ల సాధనకు నడుం బిగించారని తెలుస్తోంది.

More Telugu News