patanjali: ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి ‘పతంజలి’ జీన్స్

  • పరిధాన్ బ్రాండ్ పేరిట దుస్తులను విక్రయిస్తాం
  • ఈ ఏడాది చివరి నాటికి ఈ జీన్స్ మార్కెట్లో లభిస్తాయి 
  • దేశ వ్యాప్తంగా 100 స్టోర్లను ప్రారంభిస్తాం

స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా తమ సంస్థ నుంచి దుస్తులను విక్రయించనున్న విషయాన్ని పతంజలి ఆయుర్వేద్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ సంస్థ తయారు చేసే దుస్తులను ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకు రానున్నట్టు సంస్థ ఎండీ, సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పరిధాన్ బ్రాండ్ కింద తమ సంస్థ దుస్తులను విక్రయిస్తామని, వీటి విక్రయాల కోసం దేశ వ్యాప్తంగా మెట్రో, ఇతర నగరాల్లో 100 స్టోర్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా జీన్స్ దుస్తుల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ జీన్స్ మార్కెట్లో లభ్యమవుతాయని చెప్పారు. థర్డ్ పార్టీ సహకారంతో తమ సంస్థ దుస్తులను తయారు చేస్తున్నామని, కొత్త వ్యాపారాల నిర్వహణ కోసం నోయిడాలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

కాగా, ‘పరిధాన్’ బ్రాండ్ కింద  మార్కెట్లోకి రాబోయే దుస్తుల్లో.. పిల్లల దుస్తులతో పాటు యోగా దుస్తులు, దుప్పట్లు, స్పోర్ట్స్ వేర్, టోపీలు, టవల్స్, బూట్లు.. విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితులు, సంప్రదాయాలకు అనుగుణంగా స్వదేశీ జీన్స్ ను రూపొందిస్తున్నామని యోగా గురువు రాం దేవ్ బాబా ఇటీవల తెలిపారు.

More Telugu News