Rahul Gandhi: ఇఫ్తార్ విందుకు ప్రణబ్ కూడా వస్తున్నారోచ్: కాంగ్రెస్ ప్రకటన

  • రేపు ఢిల్లీలో రాహుల్ ఇఫ్తార్ విందు
  • ఆహ్వానితుల జాబితాలో ప్రణబ్ లేరంటూ ప్రచారం  
  • స్పందించిన కాంగ్రెస్.. ఊహాగానాలకు చెక్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ హోటల్‌లో రేపు (బుధవారం) ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. అయితే, మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించలేదన్న వార్తలు సోమవారం హల్‌చల్ చేశాయి. పలు న్యూస్ చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌లు వేశాయి. ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైన ఆయనను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని పేర్కొన్నాయి.

ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌ను ఆహ్వానించకపోవడం అన్నది హాట్ టాపిక్‌గా మారడంతో ఎట్టకేలకు కాంగ్రెస్ స్పందించింది. ఆయనను కూడా ఆహ్వానించినట్టు వివరణ ఇచ్చింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. బుధవారం తాజ్ ప్యాలెస్‌లో ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌ను ఆహ్వానించినట్టు చెప్పారు. తమ ఆహ్వానాన్ని ఆయన మన్నించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ వార్తకు చెక్ పడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News