Hyderabad: 'అమీర్ పేట్ - హైటెక్ సిటీ' మార్గంలో మెట్రో రైల్ అక్టోబర్ లో ప్రారంభిస్తాం: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

  • హైదరాబాద్ మెట్రోను ‘గూగుల్’ కు అనుసంధానం చేస్తాం
  • అమీర్ పేట్ - ఎల్బీనగర్ మెట్రో రైల్ ఆగస్ట్ లో ప్రారంభిస్తాం
  • అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ వరకు అనుసంధానం చేస్తాం

హైదరాబాద్ మెట్రోను ‘గూగుల్’ కు అనుసంధానం చేస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మెట్రో రైలులో రోజుకు ఎనభై వేల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. అమీర్ పేట్ - హైటెక్ సిటీ వరకు మెట్రో రైలును అక్టోబర్ లో ప్రారంభిస్తామని, ప్రస్తుతం అమీర్ పేట్ - ఎల్బీనగర్ వరకు ఎలక్ట్రిసిటీ టెస్ట్ రన్ జరుగుతోందని చెప్పారు. జులై చివరి నాటికి ట్రయల్ రన్ పూర్తి చేసి ఆగస్ట్ లో ప్రారంభిస్తామని చెప్పారు.

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని 2019 మార్చిలోగా పూర్తి చేస్తామని, ‘పాతబస్తీలో మెట్రో’ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ‘మెట్రో’ రెండో దశలో భాగంగా అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ వరకు అనుసంధానం చేస్తామని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఫలక్ నుమా వరకు మెట్రో పిల్లర్స్ కు యూనిక్ నెంబరింగ్ ఇస్తామని, కారిడార్ 1కు ‘ఏ’, కారిడార్ 2కు ‘బి’, కారిడార్ 3కి ‘సీ’ ఇస్తామని చెప్పారు.

More Telugu News