pakistan: పాకిస్థాన్ లో చట్టం, రాజ్యాంగం ఎక్కడున్నాయి?: నవాజ్ షరీఫ్

  • ముషారఫ్ కు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు
  • పాకిస్థాన్ లో ఎక్కడా చట్టాలు అమలు కావడం లేదు
  • మే 12 మారణహోమం వెనుక ముషారఫ్ హస్తం ఉంది

అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈరోజు ఇస్లామాబాద్ లోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ పై మండిపడ్డారు. దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న ముషారఫ్ కు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. అరెస్ట్ నుంచి ముషారఫ్ కు సుప్రీంకోర్టు మినహాయింపును ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ లో చట్టం, రాజ్యాంగం అనేవి ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ముషారఫ్ పై కేసులు ఏమయ్యాయని అడిగారు.

అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను పరామర్శించి వచ్చేందుకు తనకు మూడు రోజుల మినహాయింపును కూడా ఇవ్వలేదని అన్నారు. ఈనెల 13న విచారణకు హాజరుకానున్న సందర్భంగా ముషారఫ్ ను అరెస్ట్ చేయరాదంటూ పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందిస్తూ పాకిస్థాన్ లో ఎక్కడా చట్టాలు అమలుకావడం లేదని అన్నారు. అక్బర్ బుగ్తి హత్యతో పాటు మే 12 మారణహోమం వెనుక కూడా ముషారఫ్ హస్తం ఉందని నవాజ్ చెప్పారు. 

More Telugu News