Prime Minister: షాకింగ్ న్యూస్... ప్రధాని మోదీని హతమార్చేందుకు మావోయిస్టుల కుట్ర!

  • మావోయిస్టులతో సంబంధాలున్న ఐదుగురి అరెస్ట్
  • వారిలో ఒకరి ఇంటి నుంచి లేఖ స్వాధీనం
  • అందులో రాజీవ్ గాంధీ ఘటన తరహా ప్రస్తావన ఉందన్న పోలీసులు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీని హతమార్చే ప్రయత్నాల్లో మావోయిస్టులు ఉన్నారంటూ పూణె పోలీసులు ఓ కుట్రను బయటపెట్టారు. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్న ఐదుగుర్ని తాము బుధవారం అదుపులోకి తీసుకోగా, వీరిలో ఒకరి నివాసం నుంచి ఓ లేఖను సీజ్ చేశామని పోలీసులు స్థానిక సెషన్స్ కోర్టుకు నివేదించారు.

దీని ఆధారంగా ప్రధాని మోదీని రాజీవ్ గాంధీ హత్య తరహాలో అంతమొందించే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి పేర్లు ముంబైకి చెందిన సుధీర్ ధవాలే, ఢిల్లీకి చెందిన రోనా జాకబ్, నాగ్ పూర్ కు చెందిన న్యాయవాది సురేంద్ర గండ్లింగ్, షోమా సేన్, మహేష్ రావత్. ఈ ఐదుగుర్ని పూణెలోని సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టగా, వారిని ఈ నెల 14 వరకు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది.

నిందితుల్లో రోనాజాకబ్ నివాసం నుంచి లేఖను స్వాధీనం చేసుకున్నట్టు ప్రాసిక్యూటర్ ఉజ్వల్ పవార్ కోర్టుకు తెలిపారు. అందులో ఎం-4 రైఫిల్, నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేసేందుకు రూ.8 కోట్లు అవసరమని పేర్కొనడంతో పాటు, రాజీవ్ గాంధీ హత్య తరహా ఘటన గురించి ప్రస్తావన ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధాని మోదీ పేరును ప్రస్తావించకుండా మరో రాజీవ్ గాంధీ ఘటన తరహాలో ఆలోచిస్తున్నట్టు నివేదించారు. అయితే, ప్రాసిక్యూషన్ వాదనలను, ప్రవేశపెట్టిన పత్రాలను అవాస్తవాలుగా నిందితుల తరఫున డిఫెన్స్ న్యాయవాది వాదించారు.

More Telugu News