world peace index 2018: ‘శాంతి’ విషయంలో మరో మెట్టు పైకెక్కిన మన దేశం

  • 137 నుంచి 136వ స్థానానికి చేరిక
  • దక్షిణాసియాలో మన కంటే దిగువన ఉన్నవి పాక్, అఫ్ఘాన్ మాత్రమే
  • మన దేశంలో పెరిగిన రాజకీయ అస్థిరత

ప్రపంచ శాంతి సూచీలో భారత్ ఒక స్థానం మెరుగుపరుచుకుంది. గతేడాది 137లో ఉండగా, ‘2018 ప్రపంచ శాంతి సూచీ’లో 136కు చేరుకుంది. ఈ సూచీని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) అనే సంస్థ రూపొందించింది.  ప్రపంచ వ్యాప్తంగా 99.7 శాతం జనాభాను కవర్ చేస్తూ, భద్రత, రక్షణ తదితర 23 అంశాలను ఆధారంగా చేసుకుని సూచీలో దేశాలకు స్థానాలను కేటాయించడం జరిగింది. ఇక గత దశాబ్దంతో పోలిస్తే ఇప్పుడే ప్రపంచంలో శాంతిపవనాలు తగ్గాయని ఐఈపీ సంస్థ తెలిపింది.

ఈ ఏడాది ప్రపంచ శాంతి సూచీలో ఐస్ ల్యాండ్ అగ్ర స్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రియా, పోర్చుగల్, డెన్మార్క్, కెనడా, చెక్ రిపబ్లిక్, సింగపూర్, జపాన్, ఐర్లాండ్ మొదటి పది స్థానాల్లో వరుసగా ఉన్నాయి. భారత్ లో నేరాల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా స్కోరు కాస్త పెరిగినట్టు ఐఈపీ తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయంలోనే అధికారం కేంద్రీకృతం కావడం వల్ల రాజకీయ అస్థిరత విషయంలో భారత స్కోరు తగ్గిందని పేర్కొంది. ఇక మన పొరుగు దేశాలైన భూటాన్, శ్రీలంక, నేపాల్ కూడా శాంతి విషయంలో మెరుగుపడ్డాయి. దక్షిణాసియా ప్రాంతంలో భారత్ కంటే తక్కువ స్థానాలతో ఉన్నవి పాకిస్థాన్ (151), అప్ఘానిస్తాన్ (62) మాత్రమే.

More Telugu News