sushma swaraj: టెన్షన్ పుట్టించిన సుష్మ విమానం.. 14 నిమిషాలు మిస్!

  • దక్షిణాఫ్రికా బయలుదేరిన సుష్మ
  • త్రివేండ్రం నుంచి బయలుదేరిన విమానం
  • మారిషస్‌లో అదృశ్యం

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రయాణిస్తున్న విమానం 14 నిమిషాల పాటు అదృశ్యమై అందరినీ టెన్షన్‌ పెట్టింది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా అధికారులు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.

దక్షిణాఫ్రికాలో జరుగనున్న బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు సుష్మ ఎయిర్‌ఫోర్స్ విమానం ‘మేఘ్‌దూత్’లో త్రివేండ్రం నుంచి బయలు దేరారు. విమానం ఇంధనం నింపుకోవడానికి మారిషస్‌లో ఆగాల్సి ఉండగా, ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే విమానం రాడార్ నుంచి మాయమైంది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. సాయంత్రం 4:44 గంటలకు అదృశ్యమైంది. 4:58 గంటలకు మారిషస్ ఏటీసీని పైలట్ సంప్రదించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంత్రి విమానం అదృశ్యంపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ సముద్ర తలంపై ప్రయాణించే సమయాల్లో ఇటువంటి సమస్య ఉత్పన్నమవడం తరచూ జరిగేదేనని అన్నారు. వీహెచ్ఎఫ్ కమ్యూనికేషన్‌లో అనిశ్చితి వల్ల ఇలా జరగుతుందని పేర్కొన్నారు. పైలట్లు కొన్నిసార్లు మారిషస్ ఏటీసీతో మాట్లాడడం మర్చిపోతుంటారని, మరి కొన్నిసార్లు సాధ్యం కాదని వివరించారు.

ఇక్కడ రాడార్ కవరేజీ లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. దీంతో వీహెచ్ఎఫ్/హెచ్ఎఫ్ కమ్యూనికేషన్‌పై ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. ఇటువంటి ప్రదేశాల్లో వీహెచ్ఎఫ్ కవరేజీ అంత బాగా ఉండదని, కాబట్టే వీటిని డార్క్ జోన్లుగా వ్యవహరిస్తారని ఆయన వివరించారు.

More Telugu News