Suicide: అందంగా లేనని ఆత్మహత్య చేసుకున్న యువకుడు!

  • అమ్మాయిని చూడడానికి వెళ్తే ఎగతాళి
  • అవమాన భారంతో కుంగిపోయిన యువకుడు
  • సోదరుడికి మెసేజ్ చేసి ఆత్మహత్య

విజయనగరం జిల్లా బొబ్బిలిలో విషాదం చోటుచేసుకుంది. అందంగా లేనన్న మనస్తాపంతో ఓ యువకుడు నిండు ప్రాణాలు తీసుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాలూరు మండలంలోని కొదుకరకవలసకు చెందిన మారోజు ధనుంజయ (25) ఇంటర్ పూర్తి చేసి, దూరవిద్య ద్వారా డిగ్రీ చదువుతున్నాడు.

అతడికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించి ఓ సంబంధం చూశారు. అమ్మాయిని చూసేందుకు బంధువుల ఇంటికి వెళ్లిన ధనుంజయకు అవమానం జరిగింది. ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని పలువురు ఎగతాళి చేసినట్టు తెలుస్తోంది. దీనికితోడు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా బెడిసికొట్టడంతో మానసికంగా కుంగిపోయిన ధనుంజయ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

బొబ్బిలి రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు సోదరుడు పరమేశ్వరరావుకు మొబైల్‌లో మెసేజ్ చేశాడు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందీ అరచేతిపై రాసుకున్నాడు. మెసేజ్ చూసిన సోదరుడు వచ్చే సరికే ధనుంజయ పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News