savithri: సావిత్రికి 7 బంగ్లాలు ఉండేవి .. అవన్నీ పోగొట్టుకున్నారు: మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి

  • సావిత్రి ఫ్యామిలీతో అనుబంధం వుంది 
  • ఆమె దానధర్మాలు బాగా చేసేవారు 
  • ఆర్థికంగా మరీ అంతగా చితికిపోలేదు

'మహానటి' సినిమా విశేషమైన ఆదరణ పొందుతోన్న నేపథ్యంలో సావిత్రితో తమకి గల అనుబంధాన్ని చాలామంది మీడియాతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా సావిత్రి ఫ్యామిలీతో తమకి గల అనుబంధాన్ని గురించి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రస్తావించారు. "సావిత్రి గారితో మా అమ్మకి చాలా సాన్నిహిత్యం ఉండేది. అందువలన అమ్మతో కలిసి నేను ఆ ఇంటికి వెళ్లడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉండేది. అడిగినవారికి లేదనకుండా సావిత్రి దానధర్మాలు చేసేవారు. తన ఇంట్లోని పనివాళ్లు మోసం చేస్తున్నారని తెలిసి కూడా ఆమె పెద్దగా పట్టించుకునేవారు కాదు. చెన్నై .. హైదరాబాద్ .. విజయవాడ .. కొడై కెనాల్ లో కలిపి ఆమెకి చాలా ఖరీదైన 7 బంగ్లాలు ఉండేవి. సావిత్రి బంగ్లా అని అప్పట్లో వాటి గురించి గొప్పగా చెప్పుకునేవారు. అలాంటి బంగ్లాలన్నిటినీ ఆమె కోల్పోయారు. ఆమె నుంచి సాయాన్ని పొందినవారెవరూ ఆ తరువాత ఆమెను పలకరించలేదు. అయితే చివరిదశలో కూడా అందరూ చెప్పుకుంటున్నంతగా ఆమె ఆర్థికంగా చితికిపోలేదు. సావిత్రి కొడుకు .. కూతురు ఇద్దరూ కూడా ఇప్పుడు మంచి పొజీషన్లలో వున్నారు" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News