BJP: డ్రగ్స్ జోలికి పోవద్దు... బంగారం స్మగ్లింగ్ బెస్ట్: అనుచరులకు నూరిపోస్తున్న బీజేపీ ఎమ్మెల్యే

  • సులువుగా డబ్బు కావాలంటే గోల్డ్ స్మగ్లింగ్ చేయండి
  • డ్రగ్స్ అమ్మకాల్లో బిష్ణోయిలను దాటేసిన దేవాసీ వర్గం
  • వైరల్ అవుతున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

సులువుగా డబ్బు సంపాదించాలని భావించే వారు బంగారం స్మగ్లింగ్ చేస్తే మంచిదట. రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ లాల్ గార్గ్ తన అనుచరులకు ఇచ్చిన సలహా ఇది. బిలారాలో దేవాసీ వర్గం వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ అమ్మకాల జోలికి పోరాదని, డ్రగ్స్ కేసులో చిక్కితే బెయిల్ రావడం కష్టమని, అదే బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినా వెంటనే బెయిల్ లభిస్తుందని కూడా ఆయన నూరిపోశారు.

జోధ్ పూర్ జైల్లో డ్రగ్స్ కేసుల్లో ఎంతో మంది ఉన్నారని, డ్రగ్స్ అమ్మకాల్లో ఇంతవరకూ ఉన్న బిష్ణోయిల రికార్డును దేవాసీ వర్గం దాటిపోయిందని వ్యాఖ్యానించిన ఆయన, డ్రగ్స్ వ్యసనం నుంచి యువత బయటకు రావాలని సూచించారు. ఆపై తాము డ్రగ్స్ బిజినెస్ జోలికి వెళ్లబోమని, బంగారం వ్యాపారం చేస్తామని దేవాసీలతో ప్రమాణం కూడా చేయించడం గమనార్హం.

More Telugu News