New Delhi: ఢిల్లీలో హెచ్సీఎల్ టెక్కీ కిడ్నాప్... రెస్క్యూ ఆపరేషన్ చేసి విడిపించిన పోలీసులు!

  • మే 23న కిడ్నాప్ అయిన రాజీవ్
  • ఆచూకీ తెలుసుకునేందుకు వారం రోజుల శ్రమ
  • ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలీసులకు, కిడ్నాపర్లకు గాయాలు

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్సీఎల్ లో టెక్కీగా పనిచేస్తున్న ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయగా, పోలీసులు ఈ ఉదయం ఆ యువకుడిని రక్షించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నోయిడాలోని హెచ్సీఎల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న రాజీవ్ అనే యువకుడు, మే 24న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు, ముందురోజు హరిద్వార్ కు బయలుదేరాడు. ఆ క్రమంలో ఘజియాబాద్ సమీపంలోని రాజ్ నగర్ ఎక్స్ టెన్షన్ వరకూ వచ్చి అదృశ్యమయ్యాడు. ఆ మరుసటి రోజు కొందరు కిడ్నాపర్లు రాజీవ్ ఇంటికి ఫోన్ చేసి, మీ బిడ్డను అపహరించామని, తిరిగి వదిలిపెట్టాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విషయం పోలీసులకు చేరడంతో రాజీవ్ ను ఎక్కడ దాచుంచారన్న విషయాన్ని కనుక్కునేందుకు వారం రోజుల పాటు శ్రమించారు. ఢిల్లీకి సమీపంలోని ఇందిరాపురంలో అతన్ని దాచుంచారని గుర్తించి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ను పంపారు. ఈ ఉదయం రాజీవ్ ను దాచి ఉంచిన చోటుకు చేరుకున్న పోలీసులకు, కిడ్నాపర్లకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లకు, ఇద్దరు కిడ్నాపర్లకు గాయాలు అయ్యాయి. వారి బారి నుంచి రాజీవ్ ను రక్షించిన పోలీసులు, ఇదే గ్రూప్ గతంలోనూ యువకులను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిందని పోలీసు అధికారులు వెల్లడించారు.

More Telugu News