Chandrababu: ఇకపై ప్రైవేట్ ఆసుపత్రి రోగులకు కూడా ఉచిత డయాలసిస్, పింఛన్లు: చంద్రబాబు

  • ఏపీలో మరో 14 డయాలసిస్ కేంద్రాలు
  • మూడు ప్రాంతాలలో 100% స్క్రీనింగ్
  • తండాలలో అవగాహనా శిబిరాలు
  • జూన్ 1నుంచి పోషకాహారం కోసం అటుకుల లడ్డూలు  

ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స తీసుకుంటోన్న కిడ్నీ పేషంట్లకే కాక ఇకపై ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు కూడా ఉచిత డయాలసిస్, పింఛన్లు అందజేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఆదేశించారు. ఈ రోజు విజయవాడలోని తన నివాసంలో అధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాలలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) వ్యాధి ప్రబలకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడమే కాకుండా దానిని యుద్ధప్రాతిపదికన అమలు చేయాలన్నారు. మూడు ప్రాంతాలలో 100% స్క్రీనింగ్ పూర్తిచేయాలన్నారు.

తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు సూచించారు. సురక్షిత తాగునీటిని అందుబాటులోకి తేవాలని, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి శుద్ధిచేసిన నీటినే అందజేయాలన్నారు. అధిక రక్తపోటు కారణంగా హై-డోస్ మందుల వినియోగం, విచక్షణా రహితంగా పెయిన్ కిల్లర్లు వాడటం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు.

కలుషిత తాగునీటి వినియోగం, అధిక టీడీఎస్ వల్ల కూడా ఈ వ్యాధి ప్రబలుతున్న విషయంపై అందరినీ చైతన్యపరచాలన్నారు. తండాలలో అవగాహనా శిబిరాలను నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే నిర్వహిస్తోన్న డయాలసిస్ కేంద్రాలకు అదనంగా మరో 14 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావు పేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి,ఆదోనిలో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు.

కృష్ణా జిల్లా ఎ.కొండూరులో 15 తండాలలో 13 వేల జనాభా ఉన్నారని, డయాలసిస్ 21 మందికి జరుగుతోందని, 821మంది రక్త నమూనాలు సేకరించామని ఆ జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో వివరించారు. ఇప్పటివరకు 3 మెగా మెడికల్ క్యాంపులు, 34 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లుగా ప్రభుత్వ వైద్య శిబిరాలతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 24 గంటల అంబులెన్స్ వసతి కల్పించినట్లుగా ముఖ్యమంత్రికి వివరించారు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ లు నిర్వహిస్తున్నామన్నారు.

ఎ.కొండూరులో ఇటీవల ఒక వ్యక్తి మృతిపై మీడియాలో వచ్చిన కథనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించగా, గతంలో అతడికి డయాలసిస్ జరగలేదని అధికారులు తెలిపారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో ఇబ్బంది పడ్డాడని, రెండు నెలల క్రితం స్క్రీనింగ్ లో బయట పడిందని చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.10 వేల చెక్కు అందించామన్నారు. ఎ.కొండూరు మండలంలోని 19 గ్రామాలలో పరిస్థితి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

జూన్ 1నుంచి అటుకుల లడ్డూలు..
ఉచిత మందులతో పాటుగా అందరికీ పోషకాహారం అందేలా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. జూన్ 1నుంచి అటుకుల లడ్డూలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, తక్షణమే నూజివీడు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు జిల్లాలలోఇప్పటివరకు సీకేడీ వ్యాధిగ్రస్థులకు అందిస్తోన్న వైద్యసేవలపై నివేదిక ఇవ్వాలని కోరారు.  

More Telugu News