Hyderabad: మరో యువకుడితో కనిపించింది... తట్టుకోలేకనే చంపేశా!: పోలీసుల విచారణలో వెంకటలక్ష్మి హంతకుడు

  • ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో నిందితుడు
  • కులం తక్కువని పెళ్లికి నిరాకరించింది
  • మరో యువకుడితో కలిసుండటం చూసి హత్య చేశా
  • పోలీసుల విచారణలో హోంగార్డు సాగర్ వెల్లడి

హైదరాబాద్ జవహర్‌ నగర్‌ లో తను పనిచేస్తున్న దుకాణంలోనే వెంకటలక్ష్మి (19) అనే యువతి దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ మాజీ డీసీపీ రంగనాథ్‌ ఇంట్లో పనిచేస్తున్న హోంగార్డు మిడికొండ సాగర్‌ (24) ఆమెను హత్య చేసినట్టు తేల్చారు. ప్రస్తుతం నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, విచారణలో తాను హత్య చేయడానికి దారి తీసిన పరిణామాలను గురించి సాగర్ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

తామిద్దరికి చాలాకాలంగా పరిచయం ఉందని, ఇద్దరమూ ప్రేమించుకున్నామని, కలసి తిరిగామని, పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వెంకటలక్ష్మి తల్లిదండ్రులను సంప్రదించానని చెప్పాడు. అయితే తనది తక్కువ కులమని వెంకటలక్ష్మి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో, అప్పటి నుంచి వెంకటలక్ష్మి తనను పక్కన పెట్టిందని అన్నాడు. ఇటీవలి కాలంలో ఆమె మరో యువకుడికి దగ్గరైందని, వారిద్దరూ కలసి ఉండటాన్ని చూసిన తాను భరించలేకపోయానని, ఆ కోపంతోనే దుకాణానికి వెళ్లి వెంకటలక్ష్మిని నిలదీశానని చెప్పాడు. ఆమె తన యజమానికి ఫోన్ చేయడంతో పోలీసులు వస్తారని భయపడి గొంతు కోశానని చెప్పాడు.

కాగా, హత్య తరువాత సాగర్, తిరిగి డ్యూటీలో చేరగా, మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన వివరాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు సాగర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News