India: భారత్-పాక్ సంయుక్త నిర్ణయం.. ఇక సరిహద్దు వెంబడి కాల్పులుండవ్!

  • 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని నిర్ణయం
  • సమస్యలుంటే హాట్‌లైన్ ద్వారా చర్చలు
  • నిజాయతీగా వ్యవహరించాలని నిర్ణయం

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దాయాది యథేచ్ఛగా దానిని ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూనే వుంది. సరిహద్దు వెంబడి ప్రతీ రోజూ కాల్పులకు దిగుతూ పౌరులు, సైనికుల ప్రాణాలను బలిగొంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరళ్లు (డీజీఎంవో) మంగళవారం హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా 2003లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై ఈ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని నిర్ణయం తీసుకున్నారు.  ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు నిజాయతీగా చర్యలు తీసుకోవాలని, సరిహద్దులోని ప్రజలకు ఎటువంటి అపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. నియంత్రణ రేఖ, వర్కింగ్ బౌండరీ వెంబడి పరిస్థితులపై సమీక్షించారు.
 
 సమస్యలు వస్తే స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగులు ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కరించుకోవాలని, అలాగే హాటల్‌లైన్ ద్వారా చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల డీజీఎంవోల మధ్య హాట్‌లైన్ ద్వారా జరిగిన చర్చల విషయాన్ని భారత సైన్యం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

More Telugu News