Ujwala Yojana: దోశ కోసం మీ ఇంటికి వస్తాను... చేసి పెడతావా?: తమిళనాడు మహిళను అడిగిన ప్రధాని మోదీ

  • ఉజ్వల యోజన పథకంపై మోదీ సమీక్ష
  • లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్
  • పలువురితో ముచ్చటించిన మోదీ

'ఉజ్వల యోజన' పథకం కింద వంట గ్యాస్ ను పొందుతున్న మహిళలతో నరేంద్ర మోదీ, వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వేళ, ఓ మహిళకు అరుదైన చాన్స్ లభించింది. తమిళనాడుకు చెందిన రుద్రమ్మ అనే మహిళను పలకరించిన మోదీ, తొలుత గ్యాస్ సిలిండర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు పొందుతున్నారని ప్రశ్నించారు. దీనికి ఆ మహిళ, గతంలో వంట చాలా కష్టంగా ఉండేదని, ఇప్పుడు సులువుగా వంట చేసుకుంటున్నానని బదులివ్వగా, "నేను మీ ఇంటికి వచ్చినప్పుడు దోశలు చేసి పెడతావా?" అని అడగడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయింది.

ఒడిశాకు చెందిన మరో మహిళతో మాట్లాడుతున్న వేళ, ఇంటికి గ్యాస్ కనెక్షన్ వచ్చిన తరువాత పిల్లలు దేన్ని ఇష్టంగా తింటున్నారని మోదీ ప్రశ్నించగా, మ్యాగీ నూడిల్స్, చౌమియాన్, చట్ పటా అని ఆ మహిళ చెప్పడంతో నవ్వులు విరిశాయి. కశ్మీర్, అనంతనాగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ, ప్రధానిగా నరేంద్ర మోదీయే ఉండాలని రంజాన్ పర్వదినాల్లో నిత్యమూ ప్రార్థిస్తున్నట్టు తెలిపింది. ఆ సమయంలో తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్న మోదీ, తన ఇంటి చుట్టుపక్కల ముస్లిం కుటుంబాలు ఉండేవని, తనకు చాలా ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. కాగా, గత నాలుగేళ్లలో 10 కోట్ల మందికి 'ఉజ్వల యోజన' స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News