Tollywood: నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో మాదాల కూడా ఒకరు : మెగాస్టార్ చిరంజీవి

  • మాదాల రంగారావుకు నివాళులర్పించిన చిరంజీవి
  • కుటుంబసభ్యులను పరామర్శించిన అగ్రహీరో
  • మాదాలతో తన ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మెగాస్టార్

కమిట్ మెంట్ ఉన్న కథానాయకుడు మాదాల రంగారావు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్ లో మాదాల రంగారావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం, మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ, "నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి మాదాల రంగారావు గారితో పరిచయం ఉంది. ఇంకా చెప్పాలంటే, నాతో అత్యంత సన్నిహితంగా ఉండి, నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో దర్శకుడు టి.కృష్ణ, మాదాల రంగారావు గారు కూడా ఉన్నారు.

ప్రత్యేకించి నేను ఎందుకు చెబుతున్నానంటే.. ఒంగోలులో నేను చదువుకున్న రోజుల నుంచి వారితో పరిచయాలు ఉన్నాయి. దీంతో, నాపై ఆయన ప్రత్యేక అభిమానం చూపించే వారు. ‘మనం ఒంగోలు నుంచి వచ్చామయ్యా! నువ్వూ అభివృద్ధిలోకి రావాలి.. మన ఒంగోలు పేరు నిలబెట్టాలి’ అని ఎంతో ఉత్సాహపరిచేవారు. ఒక కమిట్ మెంట్ తో విప్లవాత్మక సినిమాల్లోనే మాదాల నటించారు. కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశాలు ఆయనకు వచ్చినప్పటికీ తిరస్కరించారు.  ఈరోజున ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మాదాల మరణంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మాదాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అన్నారు.

More Telugu News