Duranto Train: దురంతో రైల్లో కానిస్టేబుల్ దురాగతం... 3 గంటల పాటు బాత్ రూములో దూరి తనను తాను కాపాడుకున్న యువతి!

  • పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరిన యువతి
  • అదే కోచ్ లో సంజయ్ కుమార్ అనే కానిస్టేబుల్
  • అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో బాత్ రూములో గడిపిన బాధితురాలు

పుణె నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న రైల్లో ఓ కానిస్టేబుల్ బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఓ యువతి బాత్ రూములో దూరి, 3 గంటల పాటు అక్కడే బిక్కు బిక్కుమంటూ ఉండిపోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కామర్స్ కోర్స్ చదువుతున్న 21 సంవత్సరాల యువతి శనివారం నాడు దురంతో రైల్ ఎక్కింది. ఆమెకు సమీపంలో కూర్చున్న సంజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ కన్ను ఆమెపై పడింది. ఆమెను తాకాలని అతను ప్రయత్నించగా, బాధితురాలు వ్యతిరేకించింది.

ఆ మృగాడి చేష్టలకు భయపడి, పక్కనున్న మహిళను సాయం చేయాలని కోరగా, సాయం చేసేందుకు ఆమె ముందుకు రాలేదు. కోచ్ లో పోలీసులు ఎవరూ లేకపోవడంతో, బాత్ రూములోకి దూరి, గడియ పెట్టుకుని విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చేరవేసింది. ఆపై 3 గంటల తరువాత టీటీ ఆమె వద్దకు వచ్చి, మరో కోచ్ లో బెర్త్ ను ఏర్పాటు చేశాడు. రైలు గమ్యస్థానానికి చేరిన తరువాత పోలీసులు రంగ ప్రవేశం చేసి, సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.

More Telugu News