Karnataka: కాంగ్రెస్-జేడీఎస్ కూటమిపై దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు!

  • మా పొత్తు విధాన సౌధకే పరిమితం
  • రాజరాజేశ్వర నగర్‌లో జేడీఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం
  • కుమారస్వామి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్, జేడీఎస్

కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ కూటమిపై మాజీ ప్రధాని, జేడీఎస్ సుప్రీం హెచ్‌డీ దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో తమ పొత్తు చాలా పరిమితమైనదని పేర్కొన్నారు. అది విధాన సౌధకే పరిమితమని తేల్చి చెప్పారు. రాజరాజేశ్వరి నగర్ స్థానానికి జరిగే ఎన్నికలో జేడీఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. రేపు (సోమవారం) ఈ స్థానానికి జరగనున్న ఎన్నిక కోసం దేవెగౌడ శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌తో పొత్తు విధాన సౌధ వరకే పరిమితమని, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ స్థానం నుంచి జేడీఎస్ తరపున రామచంద్రప్ప బరిలో ఉన్నారు. దేవెగౌడ తన రోడ్‌షోలో ముఖ్యమంత్రి కుమారస్వామి పేరు ప్రస్తావిస్తూ రామచంద్రప్పను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన మునిరత్న కూడా కుమారస్వామి పేరు చెప్పి ఓట్లు అడగడం విశేషం. బీజేపీ తరపున పోటీలో ఉన్న మునిరాజు గౌడ కోసం మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రచారం నిర్వహించారు.

More Telugu News