Bihar: పాత పరిచయమున్న పాపానికి... బీహార్ మాజీ స్పీకర్ కుమారుల దారుణం!

  • ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారయత్నం
  • గతంలో కలసి చదువుకున్న సుశాంత్, బాధితురాలు
  • పోలీసు కేసు నమోదు

ఓ ఎయిర్ హోస్టెస్ పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారన్న ఆరోపణలపై బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్ ఇద్దరు కుమారులపై కేసు నమోదు అయింది. పట్నా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్ లో బాధితురాలు పని చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు పట్నాలో ఉంటారు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసి వెళ్లేందుకు ఆమె పట్నాకు వచ్చింది.

అవధేష్ కుమారుడు సుశాంత్ రంజన్ కు, ఎయిర్ హోస్టెస్ కు గతంలోనే పరిచయం ఉంది. వీరిద్దరూ కలసి చదువుకున్నారు. ఆ పరిచయంతో ఆమెను డిన్నర్ కు ఆహ్వానించాడు సుశాంత్. వారు చెప్పిన చోటకు ఆమె వెళ్లింది. అక్కడే సుశాంత్ సోదరుడు ప్రశాంత్ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలసి ఆమెను బంధించి అత్యాచారానికి ప్రయత్నించారు. తండ్రికి చెందిన గెస్ట్ హౌస్ లో బంధించి, వెళ్లిపోగా, అక్కడి ఉద్యోగుల సాయంతో బయటపడ్డ ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత కేసు నమోదు చేసుకునేందుకు వెనుకాడిన పోలీసులు, ఆపై 24 గంటల తరువాత కేసు పెట్టి దర్యాఫ్తు ప్రారంభించారు. కాగా, దీనిపై అవధేష్ స్పందిస్తూ, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News