Karnataka: రంగంలోకి దిగిన గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములు

  • సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకలో వేగంగా మారుతున్న పరిణామాలు
  • పావగడ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో శ్రీరాములు మంతనాలు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

సుప్రీంకోర్టు తీసుకున్న చారిత్రక నిర్ణయంతో కర్ణాటకలో రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప రేపు సాయంత్రం కర్ణాటక అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నాన్ని బీజేపీ మరింత వేగవంతం చేసింది.

ఈ క్రమంలో, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములు రంగంలోకి దిగారు. పావగడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే వెంకటరమణప్పతో శ్రీరాములు మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీకి మద్దతు తెలపాలంటూ వెంకటరమణప్పను శ్రీరాములు కోరినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, వెంకటరమణప్పపై నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటరమణప్పకు ముందు నుంచి కూడా గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులతో సత్సంబంధాలు ఉన్నట్టు సమాచారం. 

More Telugu News