India: ఇండియాలో ఎన్నడూలేనంత అత్యధికానికి పెట్రోలు ధర!

  • 22 నుంచి 24 పైసలు పెరిగిన 'పెట్రో' ధరలు
  • ఆల్ టైమ్ రికార్డుకు ఒక్క శాతం దూరంలో
  • మరో 70 పైసలు పెరిగితే అత్యధికమే

సెప్టెంబర్ 2013లో ఇండియాలో పెట్రోలు ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి రూ. 76.06కు చేరగా, ఇప్పుడా స్థాయికి ఒక్క శాతం మాత్రమే తక్కువగా ఉంది. ఈ ఉదయం ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను 22 నుంచి 24 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం తీసుకోగా, ఢిల్లీలో రూ. 75.32, కోల్ కతాలో రూ. 78.01, ముంబైలో రూ. 83.16, చెన్నైలో రూ. 78.16కు ధరలు పెరిగాయి.

ఇదే సమయంలో ఢిల్లీలో రూ. 66.79కి, కోల్ కతాలో రూ. 69.33కు, ముంబైలో రూ. 71.12, చెన్నైలో రూ. 70.49కి డీజిల్ ధరలు చేరాయి. ఇక ఈ ధరలు మరొక్క శాతం పెరిగితే, అంటే ఇంకో 70 నుంచి 80 పైసలు పెరిగితే, ఆల్ టైమ్ రికార్డు ధరలకు 'పెట్రో' ఉత్పత్తులు చేరుతాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు 2014 నాటి స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల కారణంగా ధరలు రికార్డు స్థాయికి చేరాయన్న సంగతి తెలిసిందే.

More Telugu News