Mithun Chakraborty: వెన్ను నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి

  • 2009లో షూటింగ్‌లో గాయపడిన మిథున్
  • ఏడాది కాలంగా బాలీవుడ్‌కు దూరంగా ఊటీలో
  • వెన్ను నొప్పి తిరగబెట్టడంతో తిరిగి ఆసుపత్రిలో చేరిక

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి వెన్ను నొప్పి సమస్యతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏడాది కాలంగా బాలీవుడ్‌కు దూరంగా ఊటీలోని సొంత ఇంట్లో ఉంటున్నారు. గతంలో ఓసారి అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్న మిథున్ సమస్య తగ్గుముఖం పట్టడంతో కొన్ని టీవీ షోలు చేశారు.

2009లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నుకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత చికిత్సతో సమస్య కొంత తగ్గినా తాజాగా మరోమారు వెన్ను నొప్పి వేధించడంతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. మిథున్ చక్రవర్తి తెలుగులోనూ నటించారు. పవన్ కల్యాణ్, వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ ‘గోపాల గోపాల’ సినిమాలో మిథున్ స్వామీజీ పాత్ర పోషించారు. లీలాధర స్వామిగా ఆయన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

More Telugu News