Hyderabad: హైదరాబాద్‌లో రూ.25 లక్షలకు రూ.100 కోట్ల విలువైన వక్ఫ్ భూమిని అప్పగించిన అధికారి!

  • వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం
  • రూ.25 లక్షలు తీసుకుని ఎన్‌వోసీ ఇచ్చిన సీఈవో
  • మధ్యవర్తికి రూ.10 లక్షలు
  • ప్రకంపనలు సృష్టిస్తున్న వ్యవహారం
హైదరాబాద్ మల్కజ్‌గిరిలోని వంద కోట్ల రూపాయల విలువైన ఐదెకరాల వక్ఫ్ భూమిని వక్ఫ్ బోర్డు అధికారి ఒకరు  రూ.25 లక్షలకు  అప్పగించేసిన   ఘటన వెలుగులోకి వచ్చింది. మే 2017లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆదివారం బయటపడడంతో సంచలనమైంది.ఈ కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరపాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయాలని తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది.

ఇటీవలి వరకు వక్ఫ్ బోర్డుకు సీఈవోగా వ్యవహరించిన ఎంఏ మన్నన్ ఫరూఖీ.. ఓ ప్రైవేటు వ్యక్తికి ఐదెకరాల వక్ఫ్ స్థలానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇందుకోసం ఆయన రూ.25 లక్షలు లంచంగా తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ డీల్ కుదిర్చిన మధ్యవర్తికి మరో పది లక్షల రూపాయలు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై నేడు బోర్డు మీటింగ్ నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం తెలిపారు. అత్యవసరమైన ఈ ఫైల్‌ను ఫరూఖీ ఎవరికీ పంపలేదని, తన వద్దకు కూడా అది రాలేదని సలీం తెలిపారు. ఈ భూ కుంభకోణంపై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ స్కామ్‌పై ఏసీబీతో దర్యాప్తు జరపాల్సిందిగా కోరనున్నట్టు తెలిపారు. అలాగే 1956 నుంచి జారీ అయిన అన్ని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌లపైనా సీఐడీతో దర్యాప్తు జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాయనున్నట్టు సలీం వివరించారు.
Hyderabad
Telangana
waqf land
KCR

More Telugu News