Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం: సర్పంచ్‌ను వెంటాడి నరికి చంపిన దుండగులు!

  • మూడపల్లి సర్పంచ్‌ దారుణ హత్య 
  • కారులో వెళ్తున్న సర్పంచ్‌ను వెంటాడి మరీ ఘాతుకం
  • ఉలిక్కిపడిన వేములవాడ

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో దారుణం జరిగింది. మండలంలోని మూడపల్లి సర్పంచ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వేములవాడ శివారులో వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఆదివారం రాత్రి కారులో వెళ్తున్న సర్పంచ్ శంకర్‌ను మరో కారులో వెంబడించిన దుండగులు అతడిని బయటకి లాగి విచక్షణ రహితంగా నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి కారులో పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శంకర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. పాత కక్షలే హత్యకు ప్రధాన కారణం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. హత్య విషయం తెలిసి వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మూడపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ మృతి విషయం తెలిసి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

More Telugu News