Karnataka: ఈ నెల 15న మోదీని కలిసి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తా: యడ్యూరప్ప

  • కర్ణాటక’లో బీజేపీకి 130 సీట్లు రావడం ఖాయం
  • సిద్ధరామయ్యకు వందశాతం ఓటమి తప్పదు
  • నేను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోగా రైతు రుణాలు రద్దు చేస్తా

‘కర్ణాటక’లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో తమదే ఆధిపత్యమని పూర్తి సమాచారం ఉందని, ఎవరి మద్దతు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 130 సీట్లు రావడం ఖాయమని, చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో సిద్ధరామయ్య ఓటమిపాలు కావడం వందశాతం ఖాయమని జోస్యం చెప్పారు.

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుస్తానని..సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకుని వస్తానని చెప్పడం గమనార్హం. తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోగా రైతు రుణాలు రద్దు చేస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చారు.

More Telugu News