Mumbai Indians: ముంబైని గెలిపిస్తున్న నీతా అంబానీ 'మంత్రాలు'!

  • మ్యాచ్ జరుగుతుంటే మంత్రాలు జపిస్తున్న నీతా అంబానీ
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

ఐపీఎల్‌ ప్రారంభంలో తొలుత వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలు ఎలా సాధిస్తోంది? అట్టడుగు నుంచి ఐదో స్థానానికి వచ్చి ప్లే ఆఫ్ రేసులో ఎలా నిలిచింది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం.. జట్టు సహ యజమాని నీతా అంబానీ! మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టాండ్స్‌లో కూర్చుంటున్న నీతా పఠించే మంత్రాలే జట్టును విజయ తీరాలకు చేరుస్తున్నాయని సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతోంది. నీతా మంత్రాలు పఠిస్తున్న వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తుండగా, రకరకాల కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నీతా అంబానీ మంత్ర పఠనంలో బీజీగా ఉన్నారు. మంత్రాలు పఠించడం పూర్తయ్యాక పక్కనే ఉన్న స్నేహితురాలు స్కోరు చెప్పడం, నీతా ముఖం సంతోషంతో వెలిగిపోవడం వీడియోలో చక్కగా కనిపిస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై కామెంట్లు పేలుతున్నాయి. ముంబైని ఆటగాళ్లు గెలిపించడం లేదని, నీతా అంబానీ మంత్రాలే జట్టును గెలిపిస్తున్నాయని సెటైర్లు వేస్తున్నారు.

More Telugu News