Karnataka: కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం గురూజీ ఆశీర్వాదం పొందిన అమిత్ షా!

  • రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమాన్ని సందర్శించిన అమిత్ షా 
  • తన కొడుకు, కోడలుతో కలిసి ఆశ్రమానికి వెళ్లిన అగ్రనేత
  • గురువానంద గురూజీ వద్ద నలభై నిమిషాలు గడిపిన వైనం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని కోరుతూ గురువానంద గురూజీ ఆశీర్వాదాన్ని అమిత్ షా పొందినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న తిరుమలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమాన్ని అమిత్ షా తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించారు. అంతకుముందు, ఆశ్రమంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి స్వయంగా హారతిచ్చిన అమిత్ షా, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్టు సమాచారం. అనంతరం, ఆశ్రమ పీఠాధిపతి గురువానంద గురూజీని కలిసేందుకు అమిత్ షా తన కొడుకు, కోడలుతో కలిసి వెళ్లారు.

సుమారు నలభై నిమిషాల పాటు గురూజీ వద్ద అమిత్ షా గడిపినట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం గురూజీ ఆశీర్వాదం పొందినట్టు ఆశ్రమ వర్గాల సమాచారం. ఈ ఆశ్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పలువురు మంత్రులు, నాయకులు గురూజీ వద్దకు గత నాలుగేళ్లుగా వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఆశ్రమంలో గురూజీని అమిత్ షా కలిసిన సమయంలో బీజేపీ నేతలను సైతం భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించకపోవడం గమనార్హం.

More Telugu News