Goa: నలుగురు ప్రియుళ్లతో కలసి భర్తను హత్య చేసిన భార్య!

  • గోవాలో కలకలం రేపిన ఘటన
  • భర్తను అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్
  • ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదుతో కుట్ర వెలుగులోకి

ఇటీవలి కాలంలో ప్రేమించిన వాడి కోసం కట్టుకున్న భర్తను హత్యలు చేయిస్తున్న భార్యల గురించి తరచూ వింటూనే ఉన్నాం. కానీ ఈ ఘటన వాటన్నింటికీ మించింది. ఒకరు, ఇద్దరు కాదు. ఏకంగా నలుగురు ప్రియుళ్లతో కలసి తన భర్తను చంపించిందో యువతి. ఈ ఘటన గోవాలో కలకలం రేపుతోంది. కుర్చోరెమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ నెల 1వ తేదీన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇస్తూ, తాను ఓ హత్యను చూశానని చెప్పాడు. దాని ఆధారంగా పోలీసులు విచారణ జరుపగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కర్ణాటక పరిధిలోని బైల్ హోగెనల్ కు చెందిన బసవరాజ్ బారికి (38), కల్పన (30) భార్యా భర్తలు. వీరు గోవాలో నివాసం ఉంటున్నారు. కల్పనకు రాజస్థాన్ కు చెందిన సురేష్ కుమార్, మార్మగోవాకు చెందిన పంకజ్ పవార్, కుర్చోరెమ్ కు చెందిన అబ్దుల్ షేక్, ఆదిత్య గుజ్జార్ లతో వివాహేతర సంబంధం ఉంది. కల్పన వ్యవహారం భర్తకు తెలిసి నిలదీసేసరికి, అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. నలుగురినీ పిలిపించుకుని ప్లాన్ చేసి భర్తను దారుణంగా హత్య చేయించింది. ముందు బసవరాజ్ ను కల్పన తాళ్లతో కట్టగా, అతను కదలకుండా చూసేందుకు ఆదిత్య గుజ్జర్ కాళ్లను పట్టుకున్నాడు. అతన్ని హత్య చేసిన తరువాత మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి, గన్నీ బ్యాగుల్లో సర్ది వేర్వేరు ప్రాంతాల్లో పడేయించింది కల్పన.

ఆమె వైఖరిని చూసి అనుమానించిన ఓ వ్యక్తి పోలీసులకు ఉప్పందించగా, వారు కల్పనను విచారించారు. ఆపై మొత్తం హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఆదిత్య మినహా మిగతావారిని అరెస్ట్ చేశామని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వీరందరిపై ఐపీసీ 302, 201 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. నిందితురాలు కల్పన, ఆయన భర్తకు గోవాలో ఎవరూ బంధువులు లేరని, ప్రత్యక్ష సాక్షి నుంచి తమకు ఫిర్యాదు అందకుండా ఉంటే ఈ హత్య ఎప్పటికీ బయటపడి ఉండేది కాదని పోలీసులు వ్యాఖ్యానించారు.

More Telugu News