mylavaram: కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత .. టీడీపీ - వైసీపీ కార్యకర్తల ఘర్షణ!

  • సహకార కేంద్ర బ్యాంక్ ను ప్రారంభించిన కేశినేని
  • ఈ కార్యక్రమంలో చంద్రబాబును పొగడడమేంటని వైసీపీ అభ్యంతరం
  • రెండు పార్టీల కార్యకర్తల ఘర్షణ..తోపులాట

కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య పరస్పరం తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మైలవరంలో ఈరోజు సహకార కేంద్ర బ్యాంక్ ప్రారంభోత్సవానికి కేశినేని నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రైతు రుణమాఫీ మొదలైన అంశాల గురించి నాని ప్రస్తావించారు. రుణ మాఫీ గురించి నాని మాట్లాడుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు అడ్డుకున్నారు. బ్యాంకు ప్రాంభోత్సవ కార్యక్రమంలో రాజకీయాల గురించి, చంద్రబాబుని పొగుడుతూ మాట్లాడటం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా, కేశినేని నాని కూడా వారికి దీటుగా సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే విధంగా చంద్రబాబు పథకాలు ఉన్నాయని, మంచి పనులు చేస్తున్నారు కనుకనే తాను మాట్లాడానంటూ కేశినేని బదులిచ్చారు. 

More Telugu News