sarees: ఈ సారి బతుకమ్మ చీరల పంపిణీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు చర్యలు

  • టెక్స్ టైల్స్ శాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష
  • అన్ని చీరలు రాష్ట్రంలోనే ఉత్పత్తి 
  • సెప్టెంబర్ మూడో వారంలోగా అన్ని చీరలు పంపిణీకి సిద్ధం
  • చీరల క్వాలీటీ, డిజైన్ల ఎంపిక పూర్తి

తెలంగాణలో టెక్స్ టైల్స్ శాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని బేగంపేట కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్‌ ఐఐసీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుండ్ల పోచంపల్లి, పాశ మైలారం అప్పారెల్, టెక్స్ టైల్ పార్కులపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు.

గతంలో ఒకసారి గుండ్ల పోచంపల్లి పార్కులో పర్యటించి, అప్పారెల్ తో సంబంధం లేకుండా ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి అనుమతులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చిన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పార్కులో తెలంగాణలో ఉన్న వివిధ హ్యాండిక్రాప్ట్ కళాకారులకు శిక్షణ ఇచ్చేలా ఒక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గుండ్ల పోచంపల్లిలో అవసరం అయిన మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని, పార్కు నిర్వహణ కోసం అవసరం అయిన కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.

పాశ మైలారం టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అక్కడ అవసరం అయిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని టిఎస్‌ ఐఐసీ అధికారులకు మంత్రి అదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు వివిధ వర్గాల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని, ఈ దిశగా టెస్కో ద్వారా మరిన్ని అమ్మకాలు పెంచేలా, ప్రజలకు చేనేత వస్త్రాలు మరింతగా అందుబాటులో ఉండేలా చేసేందుకు నూతనంగా టెస్కో వెబ్ సైట్ ఏర్పాటు, టెస్కో కేంద్రాల పెంచడం, రీ బ్రాండింగ్ వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

టెక్స్ టైల్ శాఖ ద్వారా చేపడుతోన్న నేతన్నకు చేయూత, చేనేత మిత్రా, లూమ్స్ అప్ గ్రేడేషన్ వంటి కార్యక్రమాలపైన కూడా కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాలను మరింతగా లబ్దిదారుల్లోకి తీసుకుని వెళ్లేందుకు అవసరం అయితే కమ్యూనిటీ కోఅర్డినేటర్లను కొంత మందిని నియమించుకోవాలని అదేశాలు జారీ చేశారు.

బతుకమ్మ చీరలు..

ఈ సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మొత్తం చీరలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు, సెప్టెంబర్ మూడో వారంలోగా అన్ని చీరలు పంపిణీకి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఇప్పటికే ఈ చీరల డిజైన్లు, క్వాలీటీ ఎంపికపైన సెర్ఫ్ మహిళా సంఘాలతో చర్చించి పలు డిజైన్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కులో రోడ్లు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక వసతులు పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. సిరిసిల్లాలోని అప్పారెల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్ల కార్యక్రమాల పురోగతిని మంత్రి సమీక్షించారు.                      

More Telugu News