modi: అందుకే, సుల్తాన్ ల జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్వహిస్తోంది!: ప్రధాని మోదీ

  • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ
  • చరిత్రను కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోంది
  • ప్రజల భద్రతకు, అభివృద్ధికి తాను కంకణబద్ధుడనై ఉన్నా

కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సుల్తాన్ ల జయంతులను సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్వహిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్రదుర్గలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, సమాజాన్ని విడగొట్టే కుట్రలో భాగంగానే చరిత్రను కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని, కేవలం ఒక కుటుంబ కోసం ఎందరో జాతీయ నాయకులను, వీరులను కాంగ్రెస్ పార్టీ వెనక్కి నెట్టేసిందని ఆరోపించారు.

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, ప్రజలను లూటీ చేసే అధికారం చేజారిపోతుందేమోనని ఆ పార్టీ కలత చెందుతోందంటూ ఎద్దేవా చేశారు. దళిత, ఓబీసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, వారికి అండగా ఉండేది బీజేపీ ఒక్కటేనని అన్నారు. పేద బీసీ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ప్రధాని కావడాన్ని, పేద కుటుంబానికి చెందిన మరో వ్యక్తి రాష్ట్రపతి అవడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని మోదీ విమర్శించారు.

తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎదురుదెబ్బ తగిలినట్లు కాంగ్రెస్ కు అర్థమైందని, కాంగ్రెస్ పార్టీ నేతల కాళ్ల కింద భూమి కంపించిందని, అందుకే, రోజుకో అబద్ధం చెబుతోందని విమర్శించారు. దళితులు, ఆదివాసీలు, పీడితులు, మహిళలకు భరోసా ఇస్తున్నానని ప్రజల మధ్య నుంచి వచ్చానని, వారి మధ్యలోనే పెరిగానని .. ప్రజల భద్రతకు, అభివృద్ధికి తాను కంకణబద్ధుడనై ఉన్నానని మోదీ హామీ ఇచ్చారు.

More Telugu News