uma bharathi: పక్కన కూర్చొని భోంచేసినంత మాత్రాన దళితులను శుద్ధి చేయలేను: ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు

  • నేనేం శ్రీరామచంద్రుడిని కాదు
  • దళితులు నా ఇంటికి వస్తే భోజనం పెడతా
  • నా మేనల్లుడు మీ ప్లేట్లను తీసి, శుభ్రం చేస్తాడు

కేంద్ర మంత్రి ఉమాభారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఛత్తర్ పూర్ లో ఏర్పాటు చేసిన సామూహిక భోజనాల కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను శ్రీరామచంద్రుడిని కాదని, పక్కన కూర్చొని భోజనాలు చేసినంత మాత్రాన దళితులను శుద్ధి చేయలేనని ఆమె వ్యాఖ్యానించారు. శబరి ఇంటికి వెళ్లిన రాముడు... అక్కడున్న దళితులను శుద్ధి చేశాడని, తనకు అంత శక్తి లేదని అన్నారు. కానీ దళితులు తన ఇంటికి వస్తే, భోజనం పెడతానని చెప్పారు.

తన ఇంట్లోని డైనింగ్ టేబుల్ మీద దళితులకు భోజనం పెడితే, తన వంటపాత్రలు శుద్ధి అవుతాయని ఉమా భారతి అన్నారు. ఢిల్లీలో ఉన్న తన మేనల్లుడి ఇంటికి వస్తే... ఆయన భార్య మీకు వంటకాలను వడ్డిస్తుందని, భోజనాల తర్వాత తన మేనల్లుడు మీ ప్లేట్లను తీసి, శుభ్రం చేస్తాడని తెలిపారు. తాను ఇక్కడ మీతో కలసి భోజనం చేయలేనని, ఎందుకంటే తాను ఇప్పటికే భోంచేశానని చెప్పారు. ఈ ఘటన కాస్తా వివాదాస్పదం కావడంతో, ఆ తర్వాత ఆమె క్లారిటీ ఇచ్చారు.

తికమ్ ఘర్ జిల్లాలోని పపోడాకు వెళ్లి విద్యాసాగర్ మహరాజ్ ను తాను కలవాల్సి ఉందని... దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉందని... అందుకే భోజనం చేయలేకపోయానని ఉమ తెలిపారు. భోజనం చేయనందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. దళితులను రాజకీయపరంగా, సాంఘికంగా, ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

More Telugu News