YSRCP: స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన వైసీపీ నాయకుడు అరెస్టు

  • బాల్య స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన నర్సింగ్
  • లాడ్జికి తీసుకెళ్లి అత్యాచార యత్నం
  • అరెస్టు.. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు

స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన గుంటూరు జిల్లా వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎంపీపీ రమావత్ నర్సింగ్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన రమావత్ నర్సింగ్ నాయక్ గతంలో వైసీపీ తరపున మాచర్ల ఎంపీపీగా పనిచేశారు. అదే గ్రామంలో వైసీపీకి చెందిన ఓ యువకుడు నాయక్ కు బాల్య స్నేహితుడు. రెండు కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు ఉన్నాయి. ఆ యువకుడి భార్య తాడేపల్లి మండలానికి చెందిన వ్యక్తి. గత నెల 27న తమ స్వగ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లే నిమిత్తం నర్సింగ్ నాయక్ తో కలిసి అచ్చమ్మకుంట నుంచి బయలుదేరింది.

గుంటూరులోని హిందూకళాశాల వద్ద వారు బస్సు దిగారు. హోటల్ లో భోజనం చేసి వెళదామని ఆమెకు నర్సింగ్ నాయక్ చెప్పాడు. కానీ, అక్కడి రైల్వేస్టేషన్ రోడ్డులోని లాడ్జి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించింది. ఇంటికి వెళ్లిన అనంతరం, జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 1న రమావత్ నర్సింగ్ నాయక్ పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

అయితే, ఈ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాల్సిన పోలీసులు జాప్యం చేయడమే కాకుండా, స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ ఎస్సై బేరం కుదుర్చుకున్నారని ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో నర్సింగ్ నాయక్ ను నిన్న అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నర్సింగ్ కు రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

More Telugu News