Chandrababu: 2019 ఎన్నికల్లో జగనే సీఎం.. వైసీపీ విజయం సాధిస్తుంది!: విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది
  • కర్ణాటకలోని తెలుగువారిని బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పడం దారుణం
  • చంద్రబాబు వల్ల అక్కడి తెలుగువారు ఇబ్బంది పడతారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, రానున్న రోజుల్లో పూర్తిగా పడిపోతుందని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయ సాధిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని విష్ణుకుమార్ రాజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు... హైదరాబాదులో ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి, అక్కడి నుంచి పారిపోయి వచ్చి, విజయవాడలో మకాం పెట్టారని విష్ణు అన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటు వేయవద్దని కర్ణాటకలోని తెలుగువారికి ఆయన పిలుపునిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పిలుపు ఇవ్వాలనుకుంటే ఆయన చుట్టాలకు ఇచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని... త్వరలోనే అవినీతిని బయటపెడతామని చెప్పారు. 

More Telugu News