YSRCP: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు

  • క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలు
  • రిపోర్టు తయారు చేసిన నెల్లూరు ఎస్పీ రామకృష్ణ
  • ఏసీబీ విచారణకు ఆదేశించిన డీజీపీ మాలకొండయ్య

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదైంది. క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పూర్తిస్థాయి వివరాలతో కూడిన నివేదికను తయారు చేసిన నెల్లూరు ఎస్పీ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు నివేదికను సమర్పించగా, ఆయన తదుపరి విచారణను ఏసీబీకి అప్పగించారు. ఈ కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేయాలని ఏసీబీ డీజీ ఠాకూర్ కు మాలకొండయ్య లేఖను రాశారు. దీంతో ఏసీబీ యాక్ట్ కింద కోటంరెడ్డి కేసు నమోదు చేసిన అధికారులు, క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న బుకీ గ్యాంగులకు కోటంరెడ్డి అండగా నిలిచారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

విజయవాడలోని పలు హోటళ్లలో ప్రధాన బుకీ కృష్ణసింగ్ అనుచరులతో కోటంరెడ్డి పలుమార్లు సమావేశమైనట్టు గుర్తించిన పోలీసులు, అందుకు హోటల్ బిల్లులు, సీసీటీవీ ఫుటేజీలను సాక్ష్యంగా సేకరించి, రిపోర్టుకు జత చేశారు. కృష్ణసింగ్ పేరు బయటకు వచ్చిన తరువాత, ఆయన కొన్నాళ్లు పరారీలో ఉండగా, ఆ సమయంలో దాక్కోవడానికి చోటు కల్పించింది కోటంరెడ్డేనని, ఆపై కృష్ణసింగ్ కోర్టులో తనంతట తానుగా లొంగిపోయేందుకు కూడా కోటంరెడ్డి సహకరించారని, ఇందుకుగాను విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా రూ. 23 లక్షలను కోటంరెడ్డికి కృష్ణసింగ్ అందించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

More Telugu News