Chandrababu: చంద్రబాబు వద్దకు దూసుకొచ్చి.. డబ్బులడిగిన యువతి.. భద్రతా వైఫల్యం!

  • తిరుమల ఆలయం వెలుపల ఘటన
  • సెక్యూరిటీని దాటుకుని చంద్రబాబు వద్దకు వచ్చిన యువతి
  • ఆశ్చర్యానికి గురైన ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటనలో భద్రతావైఫల్యం చోటు చేసుకుంది. జడ్ కేటగిరీ భద్రతతో పాటు, భారీ ఎత్తున భద్రతా బలగాలు ఉన్నా ఓ యువతి ఆయన వద్దకు దూసుకు రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు ఆలయం వెలుపలకు వచ్చారు. కారు వద్దకు వెళుతుండగా ఓ యువతి ఆయన వద్దకు దూసుకొచ్చింది.

మీతో ఫొటో దిగాలంటూ ఏడుస్తూ అడిగింది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన చంద్రబాబు ఆమెతో ఫొటో తీసుకున్నారు. ఆ తర్వాత నగదు ఇవ్వాలని ఆమె అడిగింది. దీంతో, ఆమె సమస్య ఏమిటో చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

వీఐపీల వద్దకు ఆమె దూసుకు రావడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు. ఇటీవల తిరుమలకు వచ్చిన నటుడు మహేష్ బాబు కారును కూడా ఆమె అడ్డుకుని, డబ్బు ఇవ్వాలని అడిగింది. దీంతో, ఆయన రూ. 500 తీసి ఇచ్చారు. టీటీడీ బోర్డు ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కూడా ఆమె అడ్డుకుంది. ఆయన వద్ద కూడా డబ్బు తీసుకుంది.

ఇప్పుడు ఏకంగా సీఎం వద్దకే వచ్చింది. అయితే ఎంతో సెక్యూరిటీ ఉండే చంద్రబాబు విషయంలో మీడియాకు కూడా ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అలాంటిది సెక్యూరిటీ జోన్ లోకి ఓ యువతి చొచ్చుకు రావడాన్ని భద్రతా వైఫల్యంగానే భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News