vasanta Nageshwararao: వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన వసంత కృష్ణప్రసాద్!

  • వైసీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తా
  • టీడీపీలో సభ్యత్వమే లేదు
  • వసంత కృష్ణప్రసాద్ వెల్లడి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ సీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా ఐతవరంలోని తన నివాసంలో ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. వైఎస్ జగన్ తనకు సీటిచ్చినా, ఇవ్వకున్నా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు.

తాను టీడీపీ అభ్యర్థుల గెలుపునకు గతంలో ఎంతో కృషి చేసినప్పటికీ, ఆ పార్టీ సభ్యత్వాన్ని ఇంతవరకూ తీసుకోలేదని గుర్తు చేసిన కృష్ణ ప్రసాద్, ఇక టీడీపీకి రాజీనామా చేయాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. తనకు జగన్ సన్నిహితుడేనని, వైవీ సుబ్బారెడ్డి మిత్రుడని వ్యాఖ్యానించిన ఆయన, తన ఆలోచనను మార్చుకునే ప్రసక్తే లేదని తెలిపారు.

 ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో చర్చించారని, తదుపరి ఎన్నికల్లో గుంటూరు నుంచి అవకాశం ఇస్తామని చెప్పారని, అయితే, కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే ఉండాలన్న తన ఆకాంక్ష మేరకు చంద్రబాబు ఆఫర్ ను తిరస్కరించినట్టు చెప్పుకొచ్చారు.

More Telugu News