Andhra Pradesh: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని... ఏపీ నిట్ విద్యార్థి ఆత్మహత్య!

  • తాడేపల్లిగూడెంలో నల్గొండ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య
  • ఏపీ నిట్‌లో ఈసీఈ చదువుతున్న అనిల్
  • ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు ఫోన్

ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ‘నిట్’ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. స్థానిక రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మల్లేపల్లికి చెందిన రమావత్ అనిల్ (21) తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. నిట్‌లో చదువుతున్న ఓ అమ్మాయిని అనిల్ ప్రేమించాడు. అయితే, ఆమె నిట్‌లో చదువు మానేసి నల్గొండ వెళ్లి డిగ్రీలో చేరింది. ఆమె అక్కడికి వెళ్లిపోయిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ శనివారం ఉదయం కళాశాల హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తాడేపల్లిగూడెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం తాడేపల్లిగూడెం చేరుకున్న అనిల్ తల్లిదండ్రులు లలిత, లాలూనాయక్‌ కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. కాగా, ఆత్మహత్యకు ముందు అనిల్ తమకు ఫోన్ చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఐఏఎస్ కావాలన్న కోరిక ఇక నెరవేరదని, తనను ఓ అమ్మాయి మోసం చేసిందని, తాను జీవితంలో ఓడిపోయానని చెప్పాడని పేర్కొన్నారు.

More Telugu News