Train Accident: యూపీలో 13 మంది చిన్నారులను చిదిమేసిన రైలు!

  • కాపలా లేని గేటు వద్ద ఘోర ప్రమాదం
  • 13 మంది చిన్నారుల మృతి
  • మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
  • అందరూ డివైన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే

ఉత్తరప్రదేశ్ లో ఈ ఉదయం ఘోరం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న వాహనాన్ని రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది అమాయకపు ముద్దులొలికే చిన్నారులు ప్రాణాలు వదిలారు. వీరందరి వయసూ 10 సంవత్సరాల్లోపే. అందరూ ఖుషీనగర్ లోని డివైన్ పబ్లిక్ స్కూలు చిన్నారులే. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ, దాదాపు 25 మందితో వెళుతున్న వ్యాన్ ను ఉదయం 6.45 - 7 గంటల మధ్య రైలు ఢీకొందని తెలిపారు. కాపలా లేని లెవల్ క్రాసింగ్ ఇదని అన్నారు. అందువల్లే దుర్ఘటన జరిగిందని, ఇక్కడ గేటు పెట్టాలని ఎప్పటి నుంచో వేడుకుంటున్నామని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు.

కాగా, సాధారణంగా ఈ రైలు ఉదయం 6 గంటలకే లెవల్ క్రాసింగ్ ప్రాంతాన్ని దాటి వెళ్లిపోతుంది. ఈ ఉదయం మాత్రం ఆలస్యమై 6.45 గంటల తరువాత వచ్చిందని తెలుస్తోంది.

More Telugu News