noida: నోయిడాలో ఘోరం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం!

  • ఈ నెల 18న నోయిడాలో జరిగిన సంఘటన
  • పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా దారుణం
  • బాలిక ఎక్కాల్సిన బస్సు మిస్సవడంతో కారెక్కించుకున్న వైనం
  • నిందితులు బాలిక దూరపు బంధువు, స్నేహితుడు, మరో వ్యక్తి

ఉన్నావో, కథువా ఘటనలను మరువకముందే మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన ఈ నెల 18న నోయిడాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకు చెందిన పదిహేడేళ్ల బాలిక కస్నాలోని పాఠశాలకు రోజూ బస్సులో వెళుతుంటుంది. అదే మాదిరిగా, ఈ నెల 18న పాఠశాలకు వెళ్లింది.

పాఠశాల అయిపోగానే అక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, మార్గమధ్యంలో ఆమె స్నేహితులు కనపడ్డారు. కారులో ఇంటివద్ద దింపుతామంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నారు. కారు వెళుతుండగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ఒకరు ఆ బాలికకు దూరపు బంధువు, మరొకరు అదే పాఠశాలలో చదువుకుంటున్న తోటి విద్యార్థి కాగా, ఇంకో వ్యక్తి అపరిచితుడు.

కాగా, మధ్యాహ్నం 3 గంటలకే ఇంటికి చేరాల్సిన తమ కూతురు రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు కంగారు పడ్డారు. రాత్రి సమయం అవుతున్నా ఆమె రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు సమీపంలో ఆరోజు అర్ధరాత్రి బాధిత బాలికను గుర్తించారు.

ఆ రోజున తాను ఎక్కాల్సిన బస్సు మిస్సవడంతో నడుచుకుంటూ వస్తుండగా, కారులో వచ్చిన ఆ ముగ్గురు తనను ఇంటి వద్ద దింపుతామంటూ నమ్మకంగా చెప్పడంతో మోసపోయానని పోలీసుల విచారణలో బాధితురాలు తెలిపింది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం, తనను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారని వాపోయింది. ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News