Sachin Tendulkar: అది జరిగిన రోజు కోహ్లీ వద్దకు వెళ్లి, షాంపేన్ తాగుతా!

  • వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్
  • కోహ్లీ సెంచరీల సంఖ్య 35
  • కోహ్లీ 50 సెంచరీలు చేస్తే, అతనితో కలసి షాంపేన్ తాగుతానన్న సచిన్

వన్డేల్లో తన పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డులు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమిస్తే... అతనితో కలసి షాంపేన్ తాగుతానని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పాడు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రచించిన 'ఎలెవెన్ గాడ్స్ అండ్ ఏ బిలియన్ ఇండియన్స్' పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా సచిన్ కు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.

వన్డేల్లో ప్రస్తుతం 35 సెంచరీలను సాధించిన విరాట్ కోహ్లీ 50 సెంచరీలను సాధిస్తే, 50 షాంపేన్ బాటిళ్లను పంపుతారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, షాంపేన్ బాటిల్స్ ను పంపనని, తానే వెళ్లి కోహ్లీతో కలసి షాంపేన్ తాగుతానని బదులిచ్చాడు. దీంతో, అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ రోజు సచిన్ 45వ జన్మదినం జరుపుకుంటున్నాడు. పుస్తకావిష్కరణ సందర్భంగా సచిన్ కేక్ కట్ చేసి, తన భార్య అంజలికి తినిపించాడు. 

More Telugu News