Sun: ఇక మరింతగా భానుడి భగభగలు... అత్యవసరమైతేనే బయటకు రండి!

  • మరో పది రోజుల్లో మరింతగా ఎండ
  • 45 డిగ్రీల వరకూ చేరే అవకాశం
  • కొన్ని చోట్ల వర్షాలకు అవకాశం

వచ్చే పది రోజుల్లో ఎండ వేడిమి మరింతగా పెరగనుందని, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇదే సమయంలో కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ వలయాకారంలో ఉపరితల ద్రోణి ఉన్న కారణంగా బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలులతో ద్రోణి కలసి, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు.

వర్షం పడే అవకాశమున్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంత తక్కువగా ఉంటాయని అన్నారు. ఈ సంవత్సరం వడగాలులు ఇంకా రాలేదని అన్నారు. పగలు రేడియేషన్ అధికంగా ఉన్న కారణంగా రాత్రుళ్లు సైతం సాధారణంతో పోలిస్తే మరింత ఎక్కువ వేడిమి నమోదవుతోందని తెలిపారు. ఇదిలావుండగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 4 డిగ్రీల వరకూ అధిక వేడిమి నమోదవుతోంది. దీంతో ప్రజలు ఎయిర్ కండిషన్లను అధికంగా వినియోగిస్తూ ఉండటంతో కరెంటుకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.

More Telugu News