anasuya: అందుకే నేను టీవీ న్యూస్‌ ఛానెళ్లకి వెళ్లి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేశాను: హాట్ యాంకర్‌ అనసూయ

  • పోసానితో డిబేట్‌ లో ఓ ఎడిటర్ అనుచిత వ్యాఖ్యలు
  • ఆ ఘటనతో అనసూయ గుడ్‌ బై
  • గౌరవించని చోటుకి ఎందుకెళ్లాలని ప్రశ్న

సినీనటుడు పోసాని కృష్ణమురళితో డిబేట్‌ నిర్వహిస్తూ ఓ న్యూస్‌ ఛానెల్‌ ఎడిటర్‌ ఇటీవల సినీ పరిశ్రమలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి, యాంకర్ అనసూయ స్పందించింది. జర్నలిస్టుగా ఉన్నప్పుడు చాలా బాధ్యతతో వ్యవహరించాలని, టీవీల్లో కార్యక్రమాలను చాలా మంది చూస్తారని చెప్పింది. జర్నలిస్టులు చేసే వ్యాఖ్యలను నిజమనుకుంటారని, ఆచితూచి మాట్లాడాలని వ్యాఖ్యానించింది. ఒకవేళ వారు చేసే వ్యాఖ్యలు నిజమైనవి అయినా మాట్లాడే విధానం వేరేలా ఉండాలని, బాధ్యతారహితంగా మాట్లాడకూడదని హితవు పలికింది.

అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే కావచ్చుకానీ, టీవీల్లో అలా చెప్పడం ఏంటని అడిగింది. ఈ ఘటన తరువాత తాను ఇక న్యూస్‌ ఛానెళ్లలో ఇంటర్వ్యూకి వెళ్లడం ఆపేశానని, మనల్ని గౌరవించని చోటుకి మనం ఎందుకు వెళ్లాలని ప్రశ్నించింది. తాను యాంకర్‌గా ఉన్న జబర్దస్త్‌లో మాత్రం డబుల్‌ మీనింగ్‌ డైలాగులు ఉంటాయని, కానీ అందరినీ నవ్వించడమే తమ ప్రయత్నమని చెప్పుకొచ్చింది.

పాత సినిమాల్లో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయని, రాజనాల, రేలంగిలాంటి వారు కూడా వాటిని ఉపయోగించేవారని వ్యాఖ్యానించింది. ఇప్పటికే జబర్దస్త్‌లో చాలా మార్పులు చేశామని, ఇప్పుడు చాలా మందికి నచ్చుతోందని, ఎంజాయ్‌ చేసేవారు చేస్తారని, ఏదైనా చెడ్డగా అనిపిస్తే దూరంగా ఉండండని సలహా ఇచ్చింది.

More Telugu News