Venkaiah Naidu: న్యాయ నిపుణులతో రాజ్యసభ చైర్మన్ సంప్రదింపులు!

  • హైదరాబాదు పర్యటన అర్థాంతరంగా ముగించిన ఉపరాష్ట్రపతి
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసన తీర్మానంపై చర్చ
  • పలువురు, న్యాయ రాజ్యంగ నిపుణులతో చర్చ

హైదరాబాదు పర్యటనను అర్థాంతరంగా ముగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఆయన హైదరాబాదులో జరుగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసుపై సత్వర పరిష్కారానికి న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు.

ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌, మాజీ అటార్నీ జనరల్‌ కె.పరాశరన్‌ తో పాటు లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పి.కె.మల్హోత్రా, శాసన వ్యవహారాల మాజీ కార్యదర్శి సంజయ్‌ సింగ్‌, రాజ్యసభ సచివాలయంలోని సీనియర్‌ అధికారులను అందుబాటులో ఉండాలని సూచించారు.

వారంతా అందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకుని, వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశం రాత్రి బాగా పొద్దుపోయేవరకు జరగడం విశేషం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కాంగ్రెస్‌ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభలో అభిశంసన (తొలగింపు) తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను తొలగించాలని కోరుతూ 64 మంది సిట్టింగ్‌ ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును 7 పార్టీల ప్రతినిధులు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడికి సమర్పించిన సంగతి తెలిసిందే. 

More Telugu News